తిరుమల తిరుపతి దేవస్థానాల 2020-21 సంవత్సరపు వార్షిక బడ్జెట్ను రూ.3,309.89 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని చైర్మన్ ఆవిష్కరించారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రధాన నిర్ణయాలు ఇవి:1. శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగం శనివారం నుండి తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంది. మార్చి మొదటి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.
2. తిరుమలలోని బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణ కోసం రూ.3.30 కోట్లతో అధునాతన థర్మోఫ్లూయిడ్ కడాయిలు ఏర్పాటుకు ఆమోదం.3. జూపార్కు సమీపంలో రూ.14 కోట్లతో ఎస్వీ ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణ సంస్థ హాస్టల్ భవనం, రూ.34 కోట్లతో ఎస్వీ బదిర పాఠశాల హాస్టల్ భవనాల నిర్మాణానికి ఆమోదం.
4. అలిపిరి – చెర్లోపల్లి రోడ్డు విస్తరణలో మిగిలివున్న పనులను రూ.16 కోట్లతో పూర్తి చేసేందుకు ఆమోదం.5. బర్డ్ ఆసుపత్రిలోని నూతన ఓపి భవనంలో అదనపు ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి రూ.8.43 కోట్లు మంజూరు.6. బర్డ్ ఆసుపత్రిలో వివిధ కేటగిరీల్లో అవసరమైన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయం.
7. తిరుమలలో మూడో దశలో 1300 సిసి కెమెరాలు టెండరు ద్వారా ఏర్పాటుకు రూ.20 కోట్లు మంజూరు.8. చెన్నైలోని జిఎన్ చెట్టి రోడ్డులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి కృష్ణా జిల్లాకు చెందిన నటరాజన్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు రూ.3.92 కోట్లతో టెండరు ద్వారా అప్పగించేందుకు ఆమోదం.
9. రూ.4 కోట్లతో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, పుష్కరిణి, వాహన మండపం, కల్యాణోత్సవ మండపం తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదం.10. టిటిడి నిఘా, భద్రతా విభాగంలో ఖాళీగా ఉన్న 300 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం.
11. అలిపిరి చెక్పాయింట్ వద్ద టోల్గేట్లో జాతీయ రహదారుల సంస్థ నిర్దేశించిన మేరకు వాహనాల విభజన చేపట్టి ఫాస్టాగ్ అమలు చేయాలని, టోలు రుసుం పెంచాలని నిర్ణయం. ద్విచక్ర వాహనాలకు టోలురుసుం మినహాయింపు.12. ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో టిటిడిలో సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుచేసి ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయం.
13. జమ్మూ, వారణాశి, ముంబయిలో త్వరలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతాం. త్వరలో ముంబయిలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర్రెడ్డి, ఎక్స్ అఫిసియో సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్, సివిఎస్వో గోపినాథ్జెట్టి ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.