ప్రపంచ విపత్తు కరోనా వైరస్ ను సైతం తిరుమల కొండపై పట్టించుకోకుండా టిటిడి ఇఓ, ధర్మకర్తల మండలి, తిరుమల ఉన్నతాధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల కొండపై కరోనా కేసు నమోదుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు,కేంద్ర ప్రభుత్వం,వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పదే పదే కరోనా వైరస్ పై ముందస్తు చర్యలు తీసుకోండి అని హెచ్చరిస్తున్నా టిటిడి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆయన తెలిపారు.
తిరుమల కొండపై మహారాష్ట్రకు చెందిన భక్తునికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో హడావిడిగా అలిపిరి టోల్ గేట్ మూసి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించం అని హడావిడి చేయడం కన్నా ముందస్తుగా ఆన్ లైన్ లో సేవా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు టిటిడి ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన అన్నారు.
ఈ విధంగా నిర్లక్ష్యంగా అధికారులే వ్యవహరిస్తే శ్రీవారి భక్తుల,ఆలయ అర్చకుల,టిటిడి ఉద్యోగస్తుల, తిరుమల తిరుపతి స్థానికుల ప్రాణాలకు భరోసా ఎవరిస్తారుని ఆయన ప్రశ్నించారు. తిరుమల కొండపై ఉన్న సుమారు 35 మఠాలలో ఏ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఎప్పటినుంచి ఉన్నారు ఎంతమంది ఉన్నారు అక్కడ జరుగుతున్న వివాహాలకు సంబంధించిన సమాచారం సైతం తిరుమల ఉన్నతాధికారికి తెలియక పోవడం వారి పనితీరుకు నిదర్శనమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.