ప్రపంచంలోని ఏడుఖండాల ఎత్తయిన పర్వతాలను అధిరోహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ లంబాడబిడ్డ ఆంగోతు తుకారాంకు ఆశీస్సులు ఇవ్వాలని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత భారత రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ను కోరారు.
ఇప్పటికే ఐదు పర్వతాలు అధిరోహించిన తుకారాం, అంటార్కటికా, నార్త్ అమెరికా లోని రెండు పర్వత శిఖరాలు అధిరోహించే లక్ష్యంతో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం టెక్కలపల్లితండాకు చెందిన తుకారాం, ఎవరెస్టు తో సహా ఐదు ఉన్నత పర్వతాలను అతితక్కువ కాలంలో అధిరోహించి గిన్నిస్ బుక్ లో కూడా స్థానం దక్కించుకున్నారని కవిత రాష్ట్రపతికి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల తండాలో పుట్టిన లంబాడబిడ్డ సాధించిన ఈ విజయాల పట్ల లంబాడ సామాజికవర్గానికి చెందిన తానెంతగానో సంతోషిస్తున్నానని ఆమె అన్నారు.
రాష్ట్రపతి ఆశీస్సులు, సహకారం ఉంటే తుకారాం మరిన్ని ఉన్నత విజయాలు సాధిస్తాడని కవిత అనడంతో సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్రపతి తెలిపారు.