విజయనగరం జిల్లాలో వై.ఎస్.ఆర్.వాహనమిత్ర కింద గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా 10 వేల వంతున ఆర్ధిక సహాయం అందిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.
రాష్ట్రంలో పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి హామీ ఇచ్చిన మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఎన్ని కష్టనష్టాలైనా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు. ఆటోడ్రైవర్ల కుటుంబాల ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రికి వుండాలని కోరారు. నాలుగో విడత వై.ఎస్.ఆర్.వాహనమిత్ర ఆర్ధిక సహాయం జిల్లాలోని ఆటోడ్రైవర్లకు అందజేసే కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ విశాఖలో వాహనమిత్ర సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు వీక్షించారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని విశాఖలో ప్రారంభించిన అనంతరం జిల్లాలోని వాహనమిత్రలకు నాలుగో విడతగా 13,830 మందికి 13.83 కోట్ల ఆర్ధిక సహాయం అందిస్తూ చెక్కును జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి.బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, శాసనమండలి సభ్యులు రఘురాజు, సురేష్బాబు తదితరులు అందజేశారు.
ఈ సందర్భంగా జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా వంటి ఎన్ని ఇబ్బందులున్నా లెక్కచేయకుండా ఆటోడ్రైవర్లకు ఉద్దేశించిన కార్యక్రమాన్నిఅమలుచేసిన ముఖ్యమంత్రిని వారంతా తమ గుండెల్లో పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో ఆటోడ్రైవర్కు ఏడాదికి 10 వేల వంతున నాలుగేళ్లలో 40 వేలు వారి ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు.
స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వున్నప్పటికీ పేదల కోసం ఉద్దేశించిన ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయకుండా ప్రజలకు నేనున్నాననే ఒక భరోసా కల్పించిన గొప్ప నాయకుడు వై.ఎస్.జగన్ అని పేర్కొన్నారు. జిల్లాలో గత నాలుగేళ్లలో 57 వేల మంది ఆటో డ్రైవర్లకు 57.09 కోట్లు వాహనమిత్ర కింద ప్రభుత్వం ద్వారా సహాయం అందించామన్నారు.
ప్రజలకు కష్టాల్లో ప్రభుత్వం అండగా వుంటుందనే ఒక నమ్మకాన్ని కల్పించిన ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని చెప్పారు. రానున్న రోజుల్లోనూ బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలూ కొనసాగుతాయన్నారు. వాహనమిత్ర సహాయం అందించిన ముఖ్యమంత్రిగారికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీదేవి, రవాణా అధికారులు రాంకుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.