తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని మేనిఫెస్టోలో పెట్టి వాల్మీకి బోయల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కి వాల్మీకి బోయలను మోసం చేశాడని వాల్మీకి రాష్ట్ర నేత డి. నారాయణ విమర్శించారు. బోయల ధర్నాలు రాస్తారోకోలతో దిగి వచ్చిన కేసీఆర్ అసెంబ్లీలో మొదటిసారి అసెంబ్లీలో తీర్మానం చేసి వాల్మీకి బోయలతో పాటు మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రానికి పంపించడం జరిగిందని మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో చెల్లుబాటు కావు అని తెలిసి కూడా మైనార్టీలతో కలిపి వాల్మీకుల రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి పంపడం కుట్రలో భాగమని పేర్కొన్నారు.
ఎన్నికలలో వాల్మీకి బోయలను మరొక్క మారు మోసం చేసే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం మెడలు వంచి వాల్మీకులకు రిజర్వేషన్ సాధిస్తాం అనే ప్రకటన చేయడం హాస్యాస్పదమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి పంపిన విధంగానే అసెంబ్లీ తీర్మానం పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని లేని పక్షంలో టిఆర్ఎస్ నాయకులు కేంద్రం మెడలు వంచడం కాదు వాల్మీకి బోయలే టిఆర్ఎస్ నాయకులు మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
వనపర్తి పట్టణంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టను అడ్డుకొని మున్సిపాలిటీలో పాదరక్షకాలు విడిచే స్థలంలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని పెట్టి తీవ్ర అవమానానికి గురి చేస్తున్న మంత్రి ఎన్నికల కోసమని వాల్మీకి భవన్ కు ఆదరాబాదుగా శంకుస్థాపన చేశాడనే విషయాన్ని వాల్మీకి ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానంపై మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్