సరైన నడవడిక, కష్టపడే మనస్తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని ఇందుకు అబ్దుల్ కలాం ఓ మంచి ఉదాహరణ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి పనిలో సామాజిక స్పృహ, సానుకూల దృక్పథం, జాతీయ భావాన్ని మనసులో నింపుకుని చేయాలని యువత, విద్యార్థులకు ఆయన సూచించారు.
హైదరాబాద్ లోని శాంతిసరోవర్ ఆడిటోరియంలో జరిగిన ‘కలాం కన్వెన్షన్-2020’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ‘కలలు కనండి, వాటి సాకారానికి కృషిచేయండని అబ్దుల్ కలాం ఇచ్చిన పిలుపులోని భావాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
కలలకు నూతన భాష్యం చెబుతూ, కలలు ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయని ఇందుకు కష్టించి పని చేయాలని కలాం అదించిన స్ఫూర్తి దాయక సందేశాన్ని మరవద్దని అన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, పేదరికాన్ని జయించిన అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా తర్వాత దేశ రాష్ట్రపతిగా ఎదిగిన పరిణామక్రమాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.
కుల, మత, ప్రాంత, లింగ వివక్షలను, సామాజిక అసమానతలను పారద్రోలడంలో యువత, విద్యార్థులు చొరవతీసుకోవాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయలను గౌరవిస్తూ, మన పెద్దలు అందించిన విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. చిన్నతనం నుంచే మంచి పుస్తకాలను చదవడాన్ని అలవాటుచేసుకోవాలని కలాం వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను చదివి ప్రేరణ పొందాలని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో హింసకు తావు లేదని హింసను ప్రేరేపించే ఏ విషయానికీ మద్దతు ఇవ్వొద్దని ఆయన యువతకు సూచించారు. మతోన్మాదాన్ని ప్రోత్సహించే వారు సెక్యులరిజం అనే పదాన్ని అడ్డు పెట్టుకుని, ఇతరులపై దాడి చేస్తూ ఉంటారని.. అలాంటి ప్రయత్నాలను ఖండించాలన్నారు.
2050 నాటికి ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని.. ఈ పరిస్థితుల్లో ఇందుకు అనుగుణమైన నైపుణ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడం, వినూత్న పరిష్కారాలు కనుగొనడం, సమస్యలకు సమాధానాలు కనిపెట్టే ప్రయత్నం చేయడం యువత లక్ష్యం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ వ్యవస్థాపకుడు నరేశ్, ట్రస్టీ పిడికిటి భూపాల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డితోపాటు వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పాఠశాలలనుంచి వచ్చిన దాదాపు 2,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.