వైసీపీలో మరో ధిక్కార స్వరం వినించింది. వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతుండగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాత్రం వ్యక్తిగతంగా తన ఓటు అమరావతికేనని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నిన్న కవులూరు గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు ఆయనతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిపై మీరెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధానిపై ప్రజల్లో అయోమయం నెలకొనడంతో తమ భూముల ధరలు పతనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారు. స్పందించిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్.. వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని, కాకపోతే ప్రభుత్వ విధానానికే తాను కట్టుబడి ఉండాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను చేసేదేమీ లేదని స్పష్టం చేశారు.