వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి టిటిడి సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేయిస్తోంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తరువాత వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని టిటిడి పునరుద్ధరించింది. ఇందుకోసం ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతోంది. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత స్లాట్లో స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతోంది.
రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తున్నారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీరిని ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం నాడు మాత్రం మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కేటాయించారు. వయోవృద్ధులు వయసు ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రం, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మెడికల్ సర్టిఫికేట్ చూపాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 26న మే నెల కోటా విడుదల
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం మే నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఏప్రిల్ 26వ తేదీన ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.