ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళలు, ఆడపిల్లలు అందులో టీనేజ్ అమ్మాయిల భద్రతకై ‘దిశ’ విభాగాన్నే నెలకొల్పిన విషయం విదితమే.ఇటీవలే ఆ ‘దిశ’ విభాగానికి ఏకంగా డీఐజీ ర్యాంక్ అధికారిణిని నియమించింది కూడా. గత నెల 15 వ తేదీన ‘దిశ’ డీఐజీ గా రాజకుమారీ ని డీజీపీ నియమించారు కూడా. అప్పటి నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించే పనుల్లో పడింది.. పోలీసు శాఖ.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా కేంద్రంలో ‘దిశ’ యాప్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ నిర్వహించగా ఆ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి హాజరయ్యారు కూడా. ఇక అప్పటి నుంచీ జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ ‘దిశ’ యాప్ పై మహిళా పోలీసులు, అలాగే మహిళా సంరక్షణ పోలీసుల ద్వారా అవగాహన తో పాటు యాప్ డౌన్ లోడ్ చేసుకుని.. ఏ విధంగా నిర్వహించుకోవాలో ఇలా పలు విధాలుగా జిల్లా వ్యాప్తంగా క్యాంపైన్ నిర్వహిస్తోంది.. పోలీసు శాఖ.
ఈ మేరకు జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలైన కురుపాం, జియ్యమ్మవలస ,పార్వతీపురం, జీఎం పురం పలసభద్ర వంటి ప్రాంతాల్లో పంట పొలాల్లో వరినాట్లు నాటుతున్న మహిళా రైతులను కలిసిన మహిళా సంరక్షణక ,మహిళా కానిస్టేబుళ్లు ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించారు. మొత్తానికి జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించడంలో ముందు న్నారనే చెప్పాలి.