విజయనగరం జిల్లా పోలీసు ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్యుల సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్థిక అవసరాలను తీర్చుకొనేందుకు జిల్లా పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తక్కువ వడ్డీతో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను పొందే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు ఇతర ఆర్ధిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారన్నారు. ఈ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 2022-23 సంవత్సరంకు వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు అదనపు ఎస్పీ వివరించారు.
ఈ సొసైటీ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి షేర్ కేపిటల్ పై 7.25 శాతం డివిడెంట్ను, త్రిఫ్ట్ డిపాజిట్స్ పై 3 శాతం వడ్డీని త్వరలో సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పోలీసు ఉద్యోగులు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా ఇప్పటికే రూ.2.50 లక్షల నుండి 4.50 లక్షలను వ్యక్తిగత రుణాలుగా అందజేస్తున్నామన్నారు. సొసైటీ సభ్యుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ లను కూడా త్వరలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుండి సలహాలను, సూచనలను స్వీకరించినట్లుగా, ప్రతీ మాసం సొసైటీ సెక్రటరీ, డైరెక్టర్లుతో సమావేశం నిర్వహించి, ముఖ్యమైన విషయాలను జిల్లా ఎస్పీగారి దృష్టికి తీసుకొని వెళ్ళి, నిర్ణయాలు చేపడతామని అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్ తెలిపారు.
ఈ సర్వసభ్య సమావేశంలో ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఆర్ఎస్ఐలు ఎన్. గోపాల నాయుడు, బి. రమణమూర్తి, కార్యాలయ పర్యవేక్షకులు ప్రభాకరరావు, కామేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, కో-ఆపరేటివ్ సెక్రటరీ ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు ఎస్.రామకృష్ణ, పి. ఈశ్వరరావు, ఎం. విజయ చందర్, ఎ. రమణరావు, వై. చిన్నారావు, రామా, శ్రీనివాసరావు కో-ఆపరేటివ్ సభ్యులు, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.