వెలుగు వివోఏ, మెప్మా ఆర్ పి ల సమస్యలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ధనలక్ష్మి హెచ్చరించారు. 36 గంటల పాటు ఏలూరు జిల్లా కలక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో భాగంగా రెండో రోజు బుధవారం జరిగిన ధర్నా లో పాల్గొన్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జి వి ఓ ఏ లకు మెప్మా ఆర్ పి లకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
శాసనమండలి లో సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మహిళలు 36 గంటలుగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు వద్ద ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడడం అమానుషమన్నారు. ధనలక్ష్మి మాట్లాడుతూ వివోఏ, ఆర్ పి లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాలకు అనేక ప్రభుత్వ పథకాలు అందిస్తున్నా వీరికి కనీస వేతనాలు లేవని, ప్రస్తుతం ఇస్తున్న ఎనిమిది వేల రూపాయలు నేరుగా వారి ఎకౌంట్లోకి ఇవ్వటం లేదని ఆమె వాపోయారు.
వివో ఏ లకు మహిళా మార్టులు పెట్టి సంఘాలకు కోళ్లు, గొర్రెలు, మేకలు, గేదెలు పేరుతో టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా కాల పరిమితి సర్కులర్ తీసుకువచ్చి వివోఏ, అర్.పి లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గత రెండు రోజులుగా వేలాదిమంది వివో ఏ, ఆర్ పి లు అర్ధరాత్రులు నడిరోడ్డుపై నిద్రిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. 36 గంటల దీక్ష శిబిరం వద్దకు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ వచ్చి వినతిపత్రం స్వీకరించారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ నా పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మిగిలిన అంశాలను ప్రభుత్వ దృష్టిలో నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్. లింగరాజు, డిఎన్విడి ప్రసాద్,యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్కె.సుభాషిని వివిధ సంఘాల నాయకులు ఎం.నాగమణి, ఏ ఫ్రాన్సిస్, కే లెనిన్ ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా నాయకులు మేరీ, ఆమని, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, నీరజ కృష్ణకుమారి, కిరణ్మయి వెంకటలక్ష్మి ,జగదాంబ, జగదాంబ, వి.సాయిబాబు, జై గోపి బి.జగన్నాథం తదితరులు నాయకత్వం వహించారు.