విజయనగరం ఉడా కాలనీ ఫేజ్ 3లో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లుగా ఉదయం 5 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. వెంటనే, వన్ టౌన్ సీఐ జె.మురళి మరియు రాత్రి గస్తీ తిరిగిన పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని, విచారణ చేసారన్నారు.
ఉడా కాలనీలో నివాసం ఉంటున్న ఓ 25 ఏళ్ల మహిళ తనను రాత్రి 11గంటల సమయంలో తనకు పరిచయం ఉన్న చెర్రీ అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి, బెదిరించి, రేప్ చేసాడని, అతనితోపాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా వచ్చినట్లు, ఇంటి బయట ఉన్నట్లుగా చెప్పారన్నారు. ఆ సమయంలో ఆమెతోపాటు ఇంటిలో మరో స్నేహితుడు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలిపారన్నారు. విచారణలో బాధితురాలు చేసిన ఆరోపణలకు, పిల్లలు చెప్పిన విషయాలకు వ్యత్యాసం ఉన్నాయన్నారు.
పిల్లలు కేవలం కొట్టినట్లుగా మాత్రమే చెబుతున్నారన్నారు. నేరస్ధల పరిశీలనలోఅత్యాచారం జరిగిన దాఖలాలు కనిపించడం లేదని, అయినప్పటికీ సంఘటనా స్థలం నుండి సేకరించిన కొన్ని వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే ఆరోపణల్లో వాస్తవాలు వెల్లడవుతాయన్నారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళ పోలీసు స్టేషనులో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్జి కృష్ణ వర్ధన్ అలియాస్ చెర్రి అనే వ్యక్తిని అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.