విజయనగరం జిల్లాలో గానీ, రాష్ట్రంలో గానీ రహదారులను అభివృద్ది చేసింది తమ ప్రభుత్వమేనని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రహదారులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య ఎన్ని రోడ్లు వేశారో వెళ్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, జిల్లాలో రహదారుల అభివృద్దికి తీసుకున్న చర్యలను ఛైర్మన్ వివరించారు. . త్వరలో జిల్లాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో, కావాలనే ఆ పత్రికలు తప్పుడు వార్తలను రాస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జరుగుతున్న అభివృద్దిని చూసి, ఉన్నది ఉన్నట్లుగా, వాస్తవాలను ప్రచురించాలని ఆయన పత్రికలను కోరారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో ఇటీవల కొంత కాలంగా జిల్లాలో రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం జోరుగా జరుగుతోందని తెలిపారు.
ఆర్ అండ్ బి రహదారులను సుమారు.140 కోట్లతో 26 ప్యాకేజీలుగా అభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే పలుచోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. జిల్లాలో 127 కోట్లతో, 21 ప్యాకేజీలుగా, 480 కిలోమీటర్లమేర గ్రామీణ రహదారులను అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయి, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గత ఏడేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుటంతో, ఇటీవలే తమ ప్రభుత్వం కొత్త రహదారిని నిర్మించిన విషయాన్ని వెల్లడించారు.
పారాది వద్ద కొత్త బ్రడ్జిని ఒకవైపు నిర్మిస్తూనే, మరోవైపు పాత బ్రిడ్జికి యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా చేశామన్నారు. సీతానగరం వంతెనకు కూడా ఇటీవలే మరమ్మతులు చేశామన్నారు. రాజాం, పాలకొండ రహదారి నిర్మాణానికి రూ.55 కోట్ల ఎన్డిబి నిధులతో ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా, తక్షణ మరమ్మతులకోసం రూ.9కోట్లుతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కొత్త రహదారులను వేయడంతోపాటుగా, ఉన్న రహదారులను పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రహదారులను దశలవారీగా పూర్తి చేస్తామని చెప్పారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకొని, వెంటవెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, తమ దృష్టికి తీసుకురావాలని ఛైర్పర్సన్ శ్రీనివాసరావు సూచించారు.