పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా అన్ని పార్టీలతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అధ్యక్షతన ఆదివారంనాడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి కి అఖిలపక్ష నేతలు క్లాస్ పీకారని తెలిసింది. ఆర్ధిక నేరాలలో అరెస్టయి జైలు లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు వీలుగా బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించగానే ఆ చర్చలో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని ఆయన ఆరోపించారు. దాంతో ఒక్క సారిగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్ధం కాలేదు. ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అప్పటిలో కాంగ్రెస్ పార్టీ కావాలని జైల్లో పెట్టిందని, అందువల్ల చిదంబరాన్ని పార్లమెంటు సమావేశాలలో పాల్గొనేలా అనుమతించాలని అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారని తెలిసింది. దాంతో దీనికి దానికి సంబంధం ఏమిటనే విషయం అఖిలపక్ష సమావేశంలో చర్చనీయాంశమైంది. చిదంబరం వ్యవహారంలో విజయసాయిరెడ్డి జోక్యం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారట. దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు? మీకు సంబంధం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారట. జగన్ జైలు వ్యవహారాన్ని చిదంబరంకు ఎలా ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. అనవసరమైన, సంబంధం లేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు ఆయనను ప్రశ్నించారు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని ప్రవర్తించాలని హితవు పలికినట్లు సమాచారం.