రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో బస చేశారు.
ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశమై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తీసుకోవలిసిన చర్యలపై చర్చించారు.
మరుసటి రోజు మంగళవారం ఉదయం గ్రామ ప్రజలు, అధికారులతో కలిసి గ్రామంలోని ప్రతి వార్డులో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కొసం అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు.
ఈకమిటీ ద్వారానే గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారూ. గ్రామంలో ప్రధానంగా ఉన్న మురికి కాలువ సమస్య పరిష్కారానికి 60 లక్షల రూపాయలతో పూర్తిగా అన్ని వార్డుల్లో మురికి కాలువలు నిర్మిస్తానని అన్నారు.
పెద్దకాపర్తి నుండి చిన్నకాపర్తి వరకు ఆర్&బి రోడ్ వెంట ఉన్న స్తంభాలపై వీధి దీపాలు వారం రోజుల్లో వేయిస్తానని హామీ ఇచ్చారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం గ్రామంలో పది లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రైతు వేదిక భవనం పల్లె ప్రకృతి వనం,వైకుంఠ ధామాలను ప్రారంభించారు. అలాగే బోయగుబ్బ గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని, వైకుంఠ ధామం ప్రారంభించారు.