మార్చి న 28 విశాఖబంద్
కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 28 జరుగుతున్న విశాఖబంద్ విశాఖ ప్రజలు పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ కోరారు. విశాఖపట్నం లో ప్రచార జాతా ను ప్రారంభించి మాట్లాడుతూ బిజెపి స్టీల్ ప్లాంట్ను అమ్మడమే పని పెట్టుకుందని, అందుకే ఉద్యమాలను లెక్కచేయకుండా దూకుడుగా వ్యవహరిస్తొందన్నారు. స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వరంగ సంస్థల వల్ల విశాఖతో పాటు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిందన్నారు. అంబానీ, అధానీ లాభాలకోసం బిజెపి బరితెగించిందన్నారు. ఇప్పటికే ధరలు భారీగా పెంచి ప్రజలపై భారాలు వేస్తోందన్నారు.
మరోవైపు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చివేసిందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీవేజ్, టైంస్కేలు, ఎన్.ఎం.ఆర్లను పర్మెనెంట్ చేయకుండా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుండి నిర్మాణరంగ కార్మికులకు పనులు లేవన్నారు. ఆటో, తోపుడుబండ్లు, ముఠా, బిల్డింగ్ వంటి అసంఘటితరంగ కార్మికులకు ఇ.ఎస్.ఐ., పిఎఫ్ తో కూడిన సమగ్రచట్టం చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మెనెంట్ చేయాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.సుబ్బారావు, ఎం.వి.ప్రసాద్, జె.ఆర్.నాయుడు, ఆర్.శ్రీను, ఎన్.రాజు, పి.విజయ తదితరులు పాల్గొన్నారు.