ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా గత ఆరు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వ హిందూ పరిషత్ కు కానీ హిందూ ధార్మిక సంస్థలకు కానీ సమయం కేటాయించడం లేదని విశ్వహిందూ పరిషత్ తెలిపింది. అయితే వేరే మతాల వారికి మాత్రం ప్రగతి భవన్ తలుపులు తెరిచే ఉంటున్నాయని వారు ఆక్షేపించారు.
సచివాలయంలోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం కూల్చివేతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విశ్వ హిందూ పరిషత్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసింది.
ఆ లేఖ పూర్తి పాఠం:
గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విషయము: సెక్రటరియేట్ పరిధిలో కూల్చివేతకు గురైన శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం పురాతన శివాలయం, గ్రామ దేవత అమ్మవారి ఆలయాల పునః నిర్మాణం చేయాలి – కూల్చివేతకు కారణమైన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ఆలయాల వునః నిర్మాణ కార్యాచరణకై ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోరుతూ
తెలంగాణా రాష్ట్ర నూతన సచివాలయ భవన నిర్మాణం కొరకు పాత భవనాన్ని కూల్చివేసే సమయంలో సచివాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ నల్ల పోచమ్మ దేవాలయాలు, పురాతన శివాలయాన్ని, గ్రామ దేవత ఆలయాన్ని కూడా కూల్చివేయడం యావత్ హిందూ సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఈ దుశ్చర్య హిందూ మనోభావాలు తీవ్రంగా గాయపరచింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రంలోనే చోటు చేసుకున్న దేవాలయాల కూల్చివేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు మరియు రాష్ట్ర ప్రజలకు అరిప్టాన్ని కలిగిస్తుందని దేవుడిని విశ్వసించే భక్తుడిగా మీకు తెలియంది కాదు.
ప్రజల విశ్వాసాలను మరియు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షిస్తూ కూల్చివేతకు గురైన దేవాలయాలను యధాస్థానంలో శాస్త్ర ప్రకారం ప్రభుత్వం పునః నిర్మించి జరిగిన పొరపాటుకు క్షమించమని భగవంతుడిని ప్రార్థించడం మీకు రాష్ట్ర ప్రజలకు మంచిదని విశ్వహిందూ పరిషత్ మీకు తెలియజేస్తుంది.
విమాన ప్రమాదంలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ నాటి ముఖ్యమంత్రి డా మర్రి చెన్నారెడ్డి గారు సచివాలయంకు వచ్చి శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి దయవల్లనే తిరిగి నేను సచివాలయంలో ప్రాణాలతో అడుగు పెట్టానని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ నిధులతో అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసిన విషయం, ఆలయ ప్రాముఖ్యతను విశిష్టతను మీ దృష్టికి తెలియజేస్తున్నాము.
యథాస్థానంలో ఆలయం నిర్మించాలి
తెలంగాణా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆలయాల పునః నిర్మాణం పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, కూల్చివేతకు కారణమైన అధికారులు ఎంతటి వారైనా చట్టప్రకారం కరీనా చర్యలు తీసుకోవాలని, పునః నిర్మాణం యధాస్థానంలో చేపట్టడానికి పూజ్య పీఠాధిపతులు, స్వామిజీలు మరియు ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు కార్యాచరణ ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.
లేనియెడల విశ్వహిందూ పరిషత్ కరసేవ నిర్వహించి ఆలయాలు పునః నిర్మించి తెలంగాణా ఆత్మ గౌరవాన్ని స్వాభిమానాన్ని చాటుతామని ముఖ్యమంత్రిగా మీ దృష్టికి తెలియజేస్తున్నాము.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గడిచిన 6 సంవత్సరాల కాలంలో అనేక విషయాలపై ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కలిసి వివరించడానికి సమయం కోరితే విశ్వహిందూ పరిషత్ తో పాటు ఏఒక్క హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థ ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ ఇవ్వని విషయాన్ని అదే సమయంలో ఇతర మతాల ప్రతినిధులకు ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడూ తెరచివుంచడం మీ దృష్టికి తీసుకువస్తున్నాము.
అందుకే తెలంగాణా హిందూ సమాజం పక్షాన ఈ బహిరంగ లేఖ వ్రాయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ప్రతిస్పందన వస్తుందని ఆశిస్తూ..భవదీయ
మూసాపేట రామరాజు (రాష్ట్ర అధ్యక్షులు) బండారి రమేష్ (రాష్ట్ర కార్యదర్శి)