విశాఖపట్నం జిల్లాలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ తో పాటు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీలం సహాని అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో కరోనా వైరస్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
విశాఖపట్నం నుండి కలెక్టరు వినయ్ చంద్ మాట్లాడుతూ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో 110 ఐసోలేటెడ్ బెడ్స్ సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలోని మరికొన్ని ఆస్పత్రుల్లో కూడా ఏర్పాటు చేసి ఈ సంఖ్య 120 నుండి 170 వరకు పెంచుతామన్నారు. విదేశాలనుండి నగరానికి వచ్చిన 7,337 మంది ప్రయాణీకులను విమానాశ్రయం లో 66 34 నౌకాశ్రయాల లో 703 మందిని పరీక్ష చేసి వారిలో 101 మందిని పరిశీలనలో ఉంచామని ఇప్పటి వరకు ఎవరికీ పాజిటివ్ నిర్ధారణ కాలేదు అన్నారు.
జిల్లాలో n95 మాస్కులు 8,753 పి.పి.ఈ. 714, సాధారణ మాస్కులు 47,255 సిద్ధంగా ఉన్నాయన్నారు. నౌకాదళం, సిఆర్పిఎఫ్, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, విమానాశ్రయం అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని మార్గాలను అన్ని ఆసుపత్రులను సన్నద్ధం చేశామని తెలిపారు.
ప్రజలలో అవగాహన కల్పించేందుకు జిల్లాలో హోర్డింగ్ లు, పత్రికా టీవీ ప్రకటనలు, ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను వినియోగించుకుని విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ తో బాటు జీవీఎంసీ అదనపు కమిషనర్ తమీమ్ అన్సారియా, జిల్లా వైద్యాధికారి తిరుపతి రావు డి సి హెచ్ డాక్టర్ నాయక్ చాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ డిఆర్డిఏ పిడి విశ్వేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి రావు డి ఈ ఓ లింగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.