వాలంటీర్ల జోక్యం ఎన్నికల ప్రక్రియలో లేకుండా చూడాలని, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుండి 30 రోజుల వరకు వాలంటీర్లను విధులనుండి తొలగించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వసంతబాబుకు వినతిపత్రాన్ని అందించారు.
చిలకలూరిపేట మునిసిపల్ కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో రావుసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బిఎల్ఓ లతో వాలంటీర్ల ను పంపించి ఆధార్ సేకరించే విధానాన్ని నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు వాలంటీర్ల ను ఇళ్లకు పంపించే విధానాన్ని ఆపివేయాలన్నారు.
పంచాయతీరాజ్,రెవిన్యూ, మున్సిపాలిటీ ఉద్యోగుల ద్వారా ఎన్నికల సమయంలో పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాలంటీర్ జోక్యం చేసుకోవడం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపారు.ఇదే విషయాన్ని సీఈఓ దృష్టికి నవతరంపార్టీ నుండి తీసుకువెళ్తామని తెలిపారు.
ఎన్నికల్లో జోక్యం చేసుకుని ఓటర్లను ప్రభావితం చేసే వాలంటీర్లను ఉద్యోగం నుండి తొలగించాలని రావుసుబ్రహ్మణ్యం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి వసంతబాబుకు వినతిపత్రం అందజేశారు.