వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. దానితో బాటు ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరికొన్ని మున్సిపాలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు.
ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీచేశామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్ధసారధి అన్నారు. బుధవారం సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థల), మున్సిపల్ కమీషనర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైందని తెలిపారు.
కమీషనర్, డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సాధారణ ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి, సూచనలు, నియమావళి రూపొందించి ప్రచురించామని, అవే సూచనలు, నియమనిబంధనలు ప్రస్తుతం ఎన్నికలకు వర్తిస్తాయని ఆయన తెలిపారు.
ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇండేలిబుల్ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి CDMA పర్యవేక్షిస్తారన్నారు. జనవరి 1వ తేదీ వరకు అర్హతగల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం ప్రచురించెందని ఆ జాబితాను Te-Poll సర్వర్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 5వ తేదీన ముసాయిదా వోటరు జాబితా ప్రచురిస్తామని, దానిపై అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ 11వ తేదీన తుది వోటరు జాబితా వార్డు వారీగా ప్రచురించాలన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా, స్వేచ్చాయుత వాతావరణం తో ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత పోలీస్ ఆధికారులతో చర్చించి బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
కోవిడ్ -19 కు సంబంధించి ప్రత్యేకoగా సూచనలు జారీచేశామని, వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశానికి కమీషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంబధిత జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు హాజరయ్యారు.