కేవలం పొదుపు, సేవా దృక్పథంతో మాత్రమే పని చేసిన మహిళా సంఘాలను వ్యాపారం వైపు మళ్ళిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం మహబూబ్ నగర్ లో మామిడి కొనుగోలు కేంద్రాన్ని నేడు ఆయన ప్రారంభించారు.
ఇప్పటికే డ్వాక్రా సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని, ఇదే తరహాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధిలో భాగంగా, ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా డ్వాక్రా సంఘాల మహిళలను మరింత సంఘటితం చేసేందుకు ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించామని తెలిపారు.
సన్న, చిన్న కారు రైతులకు ఆర్థిక సహాయం చేస్తూ, పండ్ల ఉత్పత్తి దారులకు, కొనుగోలు సంస్థలకు మధ్య సెర్ప్ వేదికగా నిలుస్తున్నదని మంత్రి వెల్లడించారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పేరుతో చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి కంపెనీల కింద రిజిస్టర్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 21 జిల్లాల్లో 25 ఎఫ్ పిఓలు ఏర్పడ్డాయని, ఒక్కొక్క సంఘంలో 8 వందల నుండి 12 వందల మంది సభ్యులుగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 100 ఎఫ్పిఓ ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని దీనిద్వారా 2 లక్షల కుటుంబాలు లాభపడతాయని ఆయన తెలిపారు.
సీజన్ ను బట్టి, మామిడి, పొప్పడి పండు, బత్తాయి, వాటర్ మిలన్, మాస్క్ మిలన్, జామ, సపోట వంటి పండ్ల వ్యాపారం జరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో 90 మెట్రిక్ టన్నుల మామిడి కాయల వ్యాపారం జరిగింది. ఢిల్లీ, కోయంబత్తూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది 1500 టన్నుల మామిడి కాయ వ్యాపార లక్ష్యం గా పెట్టుకున్నామని మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. మామిడి హార్వెస్టింగ్ (కాయలను తెంపడం)పై జనవరి నెలలో 70 మందికి శిక్షణ ఇప్పించామని ఆయన వెల్లడించారు. ప్రముఖ వ్యాపార సంస్థలైన ఇఫ్ కో కిసాన్, వే కూల్, మెట్రో సూపర్ మార్కెట్, మోర్, సూపర్ డెయిలీ, ఫ్రెష్ టు హోం, ఫార్మ్ దేవ్ లు ఎఫ్పీఓల నుండి మామిడి కాయలను కొనుగోలు చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.