కరోనా లాక్ డౌన్ ఉంది. ఎవరూ వీధుల్లోకి రావద్దు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకోసం సామాజిక దూరం పాటించండి. ఓకే. ఈ రెండు విషయాలు ఎవరూ కాదనరు. దాదాపు 85 శాతం ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నారు. సామాజిక దూరంలోనే ఉంటున్నారు.
సంపాదన, తిండి కూడా దూరమై చాలా మంది బాధపడుతున్నా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ లాక్ డౌన్ కు సహకరిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో లాక్ డౌన్ సమస్యతో బాటు మరొక సమస్య ఉంది. అది మంచినీటి సమస్య.
మునిసిపాలిటీ వారు మంచి నీళ్లు ఇవ్వడం లేదు కానీ మహిళలు బిందెలతో బయటకు వస్తే మాత్రం ఊరుకోవడం లేదు. ఒక వైపు ఎండవేడి పెరిగి పోతుండగా నీటి అవసరాల దృష్ట్యా బోరింగుల దగ్గరకు వచ్చే మహిళలకు కరోనా పాఠాలు చెబుతున్నారు.
అవసరమైనన్ని నీళ్లు ఇచ్చి కరోనా పాఠాలు చెప్పినా వింటారు కానీ అసలే ఏడుస్తుంటే ఈ గిల్లుడు ఏమిటి అని మహిళలు చిరాకు పడుతున్నారు. కొల్లాపూర్ మహిళల బాధలు ఉన్నతాధికారుల దృష్టికో, లేదా ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువద్దామని కొందరు జర్నలిస్టులు ప్రయత్నిస్తుంటే దాన్ని మునిసిపల్ చైర్మన్ కు సంబంధించిన వ్యక్తులు అడ్డుకుంటున్నారు.
బాధలు తీర్చరు, చెప్పుకోనివ్వరూ ఇదీ కొల్లాపూర్ మునిసిపాలిటీలో జరుగుతున్న తీరు. మున్సిపల్ చైర్మన్ మహిళ అయినా మహిళలకు నీటి కష్టాలు తీర్చే లేకపోతున్నారు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 11వ వార్డులోని ఇందిరా కాలనీ ప్రజలకు నీటి సమస్య ఏర్పడింది.
చాలా రోజుల నుంచి ఈ పరిస్థితి ఉందని కాలనీ మహిళలు చెబుతున్నారు. పాలకులు, అధికారులు వచ్చి సమస్య తీర్చలేక పోతున్నారు. శనివారం మంచినీటి సమస్య కొరతతో బోరింగ్ దగ్గర మహిళలు బారులు తీరారు. అసలే కరోనా కాలం ఒకరికి ఒకరు దగ్గర ఉండకూడదు.
కానీ ఈ నీటి సమస్యతో మహిళలు అలా ఉండే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులకు ఒకసారి నీళ్లు వదులుతారని ఆ మహిళలు అంటున్నారు. ఒకసారి అసలుకే నల్ల నీరు రాదని చెబుతున్నారు. ఒకవేళ నీళ్ళు వస్తే రాత్రివేళలో వదులుతారు. ఆ సమయంలో పట్టుకునేది ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద ఎండాకాలంలో కొల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలోని మహిళలకు నీటి సమస్య ఏర్పడిందని అర్థం అవుతుంది. ఇంతే కాదు కొన్ని వార్డులలో ఇదే సమస్య ఉందని స్థానికులు అంటున్నారు. నీటి కష్టాలను సోషల్ మీడియా ద్వారా తెలియ చేస్తే ఎలాంటి ప్రోటోకాల్ లేని ఛైర్మెన్ భర్త అటు ప్రజలపై రిపోర్టర్ ల పై విరుచుకుబడుతున్నారు. ఎవరు ఇలా వీడియోలు పెడుతున్నది వాళ్ల సంగతి చూసుకుంటా అని బెదిరిస్తున్నాడు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యత విలేకరులకు ఉంటుంది. సమస్యను పరిష్కరించాల్సి పోయి రిపోర్టర్లకే వార్నింగ్ ఇస్తున్నారు. సారూ వార్నింగ్ ఇస్తే ఇచ్చావు కానీ మా మహిళలకు నీళ్లువ్వు.