అర్హతే ప్రామాణికంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గొప్ప విషయమని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు.
ఆదివారం విజయనగరం స్థానిక 38వ డివిజన్ లోని ని బొబ్బాది పేట, ఆర్టీసీ లేఅవుట్ ప్రాంతంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి తదితరులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం జగన్ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెండేళ్లలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతూ, ప్రజల మన్ననలను చూరగొంటుందన్నారు. ఈ ప్రభుత్వానికి ఇవ్వడం, చేయడం మాత్రమే తెలుసని గత ప్రభుత్వం మాదిరి అధికారం చెలాయించడం తెలియదని అన్నారు.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజల ముంగిటికే పాలన అందిస్తున్నారని గుర్తుచేశారు.
ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలు అందే విధంగా చూడడం సీఎం జగన్ నూతన పాలనా విధానానికి నిదర్శనమని అన్నారు. గతంలో పెంన్షన్ అందాలంటే వేరొక పింఛనుదారులు మరణించిన తర్వాత అది సాధ్యపడేది అని ఆవేదన వ్యక్తం చేశారు.
దివంగత వైఎస్సార్ సీఎం అయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి 200 రూపాయల పింఛను మంజూరు చేసి ప్రజా మనసును గెలుచుకున్నా రన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి అర్హులైన వారికి 2500 రూపాయలు మంజూరు చేయడం చరిత్రలోనే గొప్ప విషయమన్నారు.
తమలాంటి నాయకుల ద్వారా ప్రజలకు ఏ ప్రయోజనం చేకూరినా అది సంతోషం, సంతృప్తి నిస్తుందని అన్నారు. రైతు ప్రభుత్వం గా మన్ననలు అందుకుంటున్న ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ పోలవరం తో సహా అన్ని ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో కొనసాగుతూ ఉండటం గుర్తించాలన్నారు.
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవడం విశేషమన్నారు. చివరి గింజ వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. ప్రజల కోసం ప్రజాహితం కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తీరుతెన్నులను ప్రోత్సహిస్తూ ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు దోహదపడుతుందన్నారు.
ప్రభుత్వ పాలన తీరు పట్ల విమర్శించడం ఎంత బాధ్యతో, ప్రోత్సహించడం కూడా అంతే బాధ్యత అని గుర్తించాలన్నారు. చేసే విమర్శలు కూడా ఆలోచించే విధంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పర్యావరణం, పచ్చతోరణం కార్యక్రమం తో నగరాలు హరితమయం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
కోటి మొక్కలు వేసి ప్రచారం చేసినా, వాటిని సంరక్షించక పోతే ఆ ప్రయత్నం వృధా అవుతుందన్నారు. కానీ నగరంలో అలాకాకుండా వేసిన ప్రతి మొక్కా సదరు యజమానికి అనుసంధానం చేస్తూ సంరక్షించే బాధ్యతను అప్పగించడం విశేషమన్నారు. రెండేళ్ల క్రితం నగరానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి ఎంతో తేడా కనిపించిందన్నారు. నగరమంతా పరిశుభ్రంగా ఉండటం అభివృద్ధి దిశగా బాటలు వేయడం సంతోషంగా ఉందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రతి రోజు ఒక ముఖ్య అతిధి ని పిలిచి వారితో మొక్కలు నటించే కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. నగరం లో వంద పార్క్ ల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇప్పటికే వార్డ్ ల వారీగా కమిటీ లను వేసి బాధ్యతలను అప్పగించడం జరిగిందన్నారు.
మొక్కల ఆవశ్యకత గూర్చి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే తమ ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవాని శంకర్ , సామాజిక అటవీ అధికారి జానకి రావు, పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ కె.ప్రసాద్, 29వ డివిజన్ కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి, జోనల్ ఇంచార్జ్ డాక్టర్ వి ఎస్ ప్రసాద్ ఇతర కార్పొరేటర్లు తాగురోతు సంధ్యారాణి, పిన్నింటి కళావతి, దాసరి సత్యవతి, నగరపాలక సంస్థ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.