దేశ జనాభాలో అత్యంత పేదలలో దళిత గిరిజనులు అంతర్భాగంగా ఉన్నారని, వీరి సంక్షేమం కోసం ఉన్న పథకాలకు మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో భారీ కోతలు పెట్టిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం( కెవిపిఎస్) గ్రామ అధ్యక్ష కార్యదర్శులు భాను, ఓమేష్ విమర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కుడికిళ్ల గ్రామంలో ప్రజా సంఘాల నాయకులు నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల పదివేల కోట్లు కుదించి ప్రజాపంపిణీ పథకం ద్వారా పేదలకు ఆహారపు సరుకులు దూరం చేసే కుట్ర చేసిందని వారన్నారు.
దేశం లో దళితుల గిరిజన జీవనాధారం అయిన ఉపాధి హామీ పని కి లక్ష పదకొండువేల రూపాయలు కోత పెట్టి పేదల పని దినాలను కూలీ సౌకర్యాలు తగ్గించిందని విమర్శించారు. నీతి ఆయోగ్ పథకాన్ని నిరుగార్చిందని, జనాభా ప్రకారం నిధులు బడ్జెట్ లో కేటాయింపులు లేవని మోడీ చెబుతున్నది, చేస్తున్నది ఆచరణలో పొంతన లేదని విమర్శించారు.
విద్యార్థులకు ఇస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో కూడా భారీ కోతలు పెట్టిందని అన్నారు. కేవలం మోడీ బడ్జెట్ తన మిత్రులైన కార్పొరేట్ పెద్దలకు న్యాయం చేసే విధంగా ఉందని అన్నారు.
అందుకే వందేమాతర రైళ్ల ను ప్రభుత్వ నిధులతో తయారు చేసి ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ అప్పచెప్పే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు విమర్శించారు. మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కెవిపిఎస్ నాయకులు రవి, శివ, పవన్, మధు తదితరులు పాల్గొన్నారు.