పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా భారతదేశం నిలిపేయాలని బహ్రెయిన్ ప్రతినిధుల సభ పిలుపునిచ్చింది. ముస్లింలు కాకుండా ఇతర శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేసే నిర్ణయం వివక్షపూరితమైనదని ప్రతినిధుల సభ ప్రకటనలో పేర్కొంది. భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని గల్ఫ్ దేశం అధికారికంగా వ్యతిరేకించడం ఇదే మొదటిసారి. బహ్రెయిన్ ప్రతినిధుల సభ భారత పార్లమెంటుకు సమానం.
భారత పౌరసత్వ చట్ట సవరణ వివక్షతతో కూడుకున్నదని, దానిని రద్దు చేయాలని ప్రతినిధుల సభ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరణ ప్రజలలో ఒక వర్గానికి పౌరసత్వం కోల్పోవడానికి దారితీస్తుందని కూడా వారన్నారు. పౌరులలో వివక్ష అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని బహ్రెయిన్ అధికారిక వార్తా సంస్థ పేర్కొన్నది. సహనం, సహజీవనం భారతదేశ ప్రాచీన సంప్రదాయమని దాన్ని విడిచిపెట్టవద్దని హితవు పలికింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచించారు. అరబ్ దేశాలతో భారతదేశ సంబంధాలు, వివిధ రంగాలలో సహకారం బలంగా ఉన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని వారు కోరారు.