దేశంలో బొగ్గు నిల్వలు తగ్గిపోతుండటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం భారతదేశం అంధకారంలోకి వెళ్లిపోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
మీడియా ఒకవైపు హెచ్చరిస్తుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రులు విద్యుత్ సంక్షోభం రాదని అనడం విడ్డూరమని ఆమె అన్నారు. 2 రోజులలో ఢిల్లీ అంధకారం అవుతుందని అంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పొరపాట్ల వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా ఇబ్బందిపడే అవకాశం ఉందని ఆమె అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నోవేల హెక్టార్ల సాగు పెరిగిందన్నారు కానీ ఈ ప్రాజెక్టు కింద ఉన్నవన్నీ ఎత్తిపోతల ప్రాజెక్టులే వీటికి విద్యుత్ అవసరం ఉంటుందని ఆమె అన్నారు. భారతదేశం చూపంతా సింగరేణి బొగ్గు గనులపైనే ఉన్నది. దీనిని కేంద్రం అధీనంలోకి తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నడపాలో ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరమున్నదని ప్రసూన అన్నారు.
శ్రీశైలం హైడ్రోపవర్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ పెడుతున్న చిక్కులను రాష్ట్ర ప్రభుత్వం అధిగమించడానికి ముఖ్యమంత్రి జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించి విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరమున్నదని ప్రసూన అన్నారు.