ఎండనక ,వాననక ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఆరు కాలం శ్రమించి కూడా తను పండించిన పంటలను అమ్ముకోవడానికి వస్తే రైతులను నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ అని వైసిపి ప్రభుత్వం లెక్కలు పెడుతోందని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆరోపించారు.
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండించిన పంట అమ్ముకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు అందివ్వాలన్నా ప్రభుత్వం పార్టీలనే లెక్కపెడుతున్నదని పార్టీల పేరుతో ఏ గ్రామానికి సంబంధించిన రైతులైన మా వైసీపీ నాయకుల ద్వారా సిఫార్సు లేఖలు తెచ్చుకోండి అని చెబుతున్నారని డాక్టర్ చదలవాడ అన్నారు.
ఇటీవల నరసరావుపేట మార్కెట్ యార్డ్ లో ప్రత్తి కొనుగోలు కేంద్రంలో అనేక గ్రామాల రైతులకు యార్డ్ అధికారులు నుండి వచ్చిన ఒత్తిడి అధికార పార్టీ నాయకుల పనితీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. అధిక ధరలను కంట్రోల్ చేయడం చేతకాని వైసీపీ ప్రభుత్వం ఇటీవలే రైతు బజార్ల ద్వారా సబ్సిడీ పై కేజీ 25/- రూపాయలకే ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
నరసరావుపేటలో మాత్రం రైతు బజారు ఉన్నప్పటికీ టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటైన రైతుబజార్లో ఉల్లి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా వైసిపి రంగులు మార్చిన వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసి ఒక్కరోజు మాత్రమే వినియోగదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైనా పక్షపాతం లేకుండా అందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి యాదవ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కడియాల రమేష్ , కడియం కోటి సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.