రాజధాని అమరావతి తరలింపునకు నిరసనగా నిరసన దీక్ష చేయడానికి స్థల సేకరణ చేస్తున్న తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులపై శుక్రవారం సాయంత్రం వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు మైనార్టీ నేత షేక్ సుభాని టౌన్ పార్టీ సెక్రటరీ దళిత నేత దూరి బాలకృష్ణ మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హుటా హుటిన విజయవాడ నుండి బయలుదేరి మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతో బయట ప్రాంతాల నుంచి రెండు వాహనాలలో వచ్చిన వైసిపి అరాచక శక్తులు మారణాయుధాలతో చేసిన ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు.
మైలవరంలో ఇంతకుముందెన్నడూ లేని విష సంస్కృతులు నెలకొన్నాయని రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినందుకు రాజధాని తరలింపు గురించి మాట్లాడుతున్న ఒక మైనారిటీ, ఒక దళిత కులానికి చెందిన నాయకులపై వైసీపీ నేతల దాడి హేయమైన చర్య అని దేవినేని అభివర్ణించారు.
రాజధాని అమరావతి తరలింపు పట్ల నిరసన వ్యక్తం చేయడం, మాట్లాడడం ఈముస్లిం మైనారిటీ, దళిత నేతలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని ప్రజాస్వామ్యంలో హింసాయుత చర్యలకు తావులేదని ఇటువంటి సంస్కృతులను విడనాడాలని నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.