అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ఆగ్రహం
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బిస్సీ అంటూ పదేపదే బడుగుల మాట చెబుతున్న ముఖ్యమంత్రి గారూ… దళిత జడ్పిటిసి మెంబర్ కూర్చునే కుర్చీపై ఉచ్చ పోసి అగౌర పరుస్తారా? అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలానికి చెందిన దళిత జడ్పిటిసి మన్నెం శీనయ్య కూర్చునే కుర్చీపై తన అనుమతి లేకుండా మండల కార్యాలయంలో కూర్చుంటావా? అని బెదిరించి, వైసిపి నాయకుడు పెజ్జాయి ప్రవీణ్ రెడ్డి కుర్చీపై ఉచ్చ పోసి అవమానపరిచినట్లు తెలిపారు.
శీనయ్యకు మూడేళ్లుగా కార్యాలయంలో కూర్చునేందుకు కుర్చీ కూడా వేయలేదని, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కుర్చీ వేయించుకుంటే, అందుకు ఆగ్రహించిన ప్రవీణ్ రెడ్డి ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలిపారు. పదేపదే సామాజిక న్యాయం గూర్చి చిలక పలుకులు పలికే ముఖ్యమంత్రి ఈ దురాగతంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే శీనయ్య తిరుపతి కలెక్టర్లకు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. దళితుల పట్ల జరుగుతున్న ఒక్కో అమానుషానికి భవిష్యత్తులో బదులు తీర్చుకుంటామని బాలకోటయ్య హెచ్చరించారు.