అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా చూపిస్తున్న కరోనా లెక్కలపై అనుమానం వ్యక్తం చేశారు. అమెరికాలో మృతుల సంఖ్య 38 వేలకు చేరిన సమయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ అనుమానం వెల్లడించారు. ఊహాన్ లో దారుణంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ సంగతి అందరికి తెలిసిందే.
అట్లాంటిది అక్కడ కేవలం 4,700 మందే మరణించారా? అదే విధంగా ఇరాన్ కేవలం 5 వేల మంది మాత్రమే చనిపోయినట్లు చెప్పారు ఇది నిజమేనా అని ఆయన ప్రశ్నించారు. కరోనా వైరస్ వ్యాధిపై వైట్ హౌస్ లో సమన్వయకర్త, ఇమ్యునాలజిస్టు డెబోరా బిక్స్ వివరాలు చెబుతుండగా జోక్యం చేసుకున్న ట్రంప్ అక్కడి మీడియా ప్రతినిధులను ఈ ప్రశ్న వేశారు.
చైనా చూపిస్తున్న మరణాల సంఖ్య ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని బిక్స్ కూడా తెలిపారు. తొలిగా వ్యాధి సంక్రమించిన దేశాలు తమ ప్రజలపై చూపిన ప్రభావాన్ని వాస్తవంగా వెల్లడిస్తే మిగిలిన దేశాలు తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, అలా కాకుండా చైనా లాంటి దేశాలే మరణాలను దాచిపెడితే వ్యాధి తీవ్రతను మిగిలిన దేశాలు గుర్తించడానికి ఆలశ్యం అవుతుందని ఆమె అన్నారు.
ఎప్పటి నుంచో వ్యాధి ఉన్నా కూడా దాన్ని దాచి పెట్టిన చైనా జనవరి చివరిలో మాత్రమే ప్రపంచానికి వెల్లడించిందని అప్పటికే చాలా దేశాలు నష్టపోయాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వ్యాధి ఏ విధంగా సంక్రమించిందో పరిశోధన చేస్తున్నట్లు తెలిపిందని ఆయన అన్నారు.
తామూ ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందిందో పరిశోధన చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. శనివారంనాడు అమెరికాలో 27 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. 1200 మరణాలు సంభవించాయి. అంతకు ముందు రోజులతో పోలిస్తే కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.