బాధ్యత గల పదవి లో ఉండి అత్యంత అజాగ్రత్తగా ప్రవర్తించి ఎందరో ఆరోగ్యానికి ముప్పు తెచ్చిన కొత్తగూడెం డిఎస్పి ఎం ఏ అలి పై తగిన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం జిల్లా వైద్య శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం డిఎస్పి కుమారుడు ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
అతను లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రంలోనే ఇంట్లోనో ఐసోలేషన్ లో ఉండాలి అలా కాకుండా అతను యథేచ్ఛగా తిరిగేందుకు తండ్రి అనుమతించాడు. ఫలితంగా కుమారుడికి కరోనా వైరస్ సోకడమే కాకుండా డిఎస్పికి, ఆయన భార్యకు, పని మనిషికి, పని మనిషి భర్తకు, పని మనిషి రెండేళ్ల పిల్ల వాడికి (కరోనా అనుమానం) కూడా కరోనా వైరస్ సోకింది.
డిఎస్పి కొడుకును గాంధీకి తరలించగా ఇప్పుడు పని మనిషి భర్తను కూడా గాంధీకి తరలించే పరిస్థితి ఉంది. డిఎస్పి తన కొడుకును తీసుకుని పార్టీలు చేసుకోవడం, పెళ్లిళ్లకు వెళ్లడం తదితర కార్యక్రమాలు చేయడంతో దాదాపు రెండు వందల మందికి కరోనా టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బాధ్యతారహితంగా ప్రవర్తించిన డిఎస్పిపై కేసు నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేయడంతో కరోనా కేసులతో బాటు 307 (హత్యాయత్నం కేసు) కూడా నమోదు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై న్యాయనిపుణులను పోలీసులు సంప్రదిస్తున్నారు.