సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కోతి సుదర్శన్ రెడ్డిపై, అప్పటి తుంగతుర్తి తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వో లపై, ప్రస్తుత మద్దిరాల తహసీల్దార్ పై మద్దిరాల పోలీస్ స్టేషన్లో 420 కేసు నమోదు అయింది.
వివరాల్లోకి వెళ్తే మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామవాసి కోతి సత్యనారాయణ రెడ్డి ఖమ్మంలో నివాసం ఉంటాడు. తన తల్లిదండ్రుల తదనంతరం తనకు రావాల్సిన వారసత్వ వాటా భూమి గురించి తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా వారసత్వ భూమి తన తమ్ముడైన కోతి సుదర్శన్ రెడ్డి సర్వీస్ లో వున్నప్పుడు తన పేరు మీద రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగ పట్టా చేయించుకున్నట్టు గుర్తించారు.
ఈ భూ పట్టా మార్పిడి వివరాలకై సమాచార హక్కు చట్టం క్రింద ప్రొసీడింగ్స్ కాపీ అడగగా ఆ భూ మార్పిడి ఫైల్ లభ్యం కావడం లేదని సమాచారం ఇచ్చారు.
విసిగిపోయిన సత్యనారాయణ రెడ్డి సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ కు ఫిర్యాదు చేసి, తుంగతుర్తి కోర్ట్ లో బాధితుడు కోతి సత్యనారాయణ రెడ్డి తరపున న్యాయవాదులు సుంకరబోయిన రాజు,కిషోర్ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దాంతో 420 కేసు నమోదు చేసి విచారణ చేయవలసిందిగా మెజిస్ట్రేట్ ఆదేశాల జారీ చేశారు.