తిరుమల తిరుమతిలో తొలి దర్శనం అందించే ఆది వరాహక్షేత్రమైన శ్రీ భూ వరాహస్వామివారి జయంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో ఆగస్టు 21న వరాహస్వామి జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం నిర్వహిస్తారు.
ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది.
స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తుంటారు. తిరుమల కొండపైకి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ భూవరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది.