ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖలో వరుసగా అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సిఐలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా ఇప్పుడు మరో సిఐ ఇంట్లో పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కామారెడ్డి పట్టణ సిఐ జగదీష్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం బాన్సువాడ రూరల్ సిఐ టాటాబాబు, నిజామాబాద్ జిల్లా బోధన్ సిఐ పల్లె రమేష్ లు 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆడిషన్ ఇంచార్జ్ ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆద్వర్యంలో ఆరుగురు సిబ్బందితో సోదాలు నిర్వహిస్తున్నారు.
సిఐ పై పలు ఆరోపణలు
సిఐ జగదీష్ కామారెడ్డికి వచ్చినప్పటి నుంచి పలు ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి. తాజాగా ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ కు సంబందించిన ఆరోపణలు సిఐపై వెల్లువెత్తాయి. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో పని చేసినప్పుడు అక్రమ కలప రవాణా, గుట్కా, బెట్టింగ్ లపై జగదీష్ పై ఆరోపణలు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం బెట్టింగ్, ఇతర అంశాలపై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఫిర్యాదులు వచ్చాయి
ఈ సందర్బంగా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. అవినీతికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగిందని, మరికొన్ని ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విచారణకు సంబంధించి ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమన్నారు
పోలీసు శాఖలో కలవరం
ఉదయం నుంచి సిఐ ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలేం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటున్నారు. సిఐ అంశం ఆయన ఒక్కరికే పరిమితం అవుతుందా లేక ఇంకా ఎవరి మెడకైనా చుట్టుకుంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.