విజయనగరం జిల్లా కు కలెక్టర్ గా వచ్చి న అతి పిన్ని వయస్కురాలైన ఎస్.నాగలక్ష్మి సంచలన మైన నిర్ణయం తీసుకున్నారు. ఈ 2023-24 సంవత్సరాల కాలపరిమితికి గాను విజయనగరం జిల్లాలో పని చేస్తున్న ఏకంగా 322 మంది జర్నలిస్టుల అక్రిడిటేషన్ల జారీకి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎస్ అధ్యక్షతన తన ఛాంబర్లో జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది.
ఆన్లైన్ ప్రక్రియలో స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, జీవో నెం.38లో పేర్కొన్న నిబంధనలు, జర్నలిస్టుల అర్హతా ప్రమాణాలు తదితర అంశాలపై చర్చ సాగింది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర విభాగాల నుంచి జిల్లా వ్యాప్తంగా 385 మంది దరఖాస్తు చేసుకోగా జీవో నెం.38 నిబంధనల మేరకు అన్ని అర్హతలున్న 322 మందికి తొలి విడతలో అవకాశం కల్పిస్తూ కమిటీ అంగీకారం తెలిపింది. వారిలో పెద్ద, చిన్న తరహా పత్రికలు, పీరియాడికల్స్ నుంచి 165, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి 122, ఫ్రీలాన్స్, వెటరన్, ఇతర విభాగాల 35 మంది జర్నలిస్టులు ఉన్నారు.
ఈ సమావేశంలో భాగంగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ & జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేశ్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, పరిశీలన, జీవో నెం.38లోని నియమ నిబంధనలు, ఇతర అంశాల గురించి సభ్యులకు వివరించారు. జీవో నెం.38 ప్రకారం అర్హత కలిగిన జర్నలిస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా అక్రిడిటేషన్ల జారీ చేయాలని పేర్కొంటూ సభ్యులందరూ సమ్మతి తెలిపారు. చిన్న పత్రికలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన అదనంగా మరొక రెండు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, స్టేట్ బస్స్ పాస్ ఉన్నవారికి ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించాలని కోరుతూ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ వారికి జిల్లా కలెక్టర్, విజయనగరం వారి ద్వారా లేఖ రాయాలని కమిటీ సభ్యులు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేశ్, గృహ నిర్మాణ శాఖ పీడీ రమణమూర్తి, ఆర్టీసీ ఆర్.ఎం. అప్పలనారాయణ, మరో ఉన్నతాధికారి శ్రీనివాసరావు, ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ అప్పలరాజు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు, ఇతర కమిటీ సభ్యులు ఎ. సూరిబాబు(సాక్షి), కె. రమేశ్ నాయుడు(ప్రజాశక్తి), ఎం.ఎం.ఎల్. నాయుడు(10టీవీ), వి. వెంకట జగన్నాథ రావు(ఎన్.టి.వి.), కె.జె. శర్మ(అక్షర కెరటం), బి. జోగారావు(ఆంధ్రజ్యోతి) తదితరులు పాల్గొన్నారు.