రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి సేకరణ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6972 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్నామని, గురువారం వరకూ దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 90వేల రైతుల నుండి సేకరించామని మంత్రి తెలిపారు.
వీటి విలువ పదివేల ఐదు వందల కోట్లు ఉంటుందని, ఇందులో 50.26 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామని, వీటికోసం 13 లక్షల గన్నీలను ఉఫయోగించామని ఇంకా అవసరాలకు మించి 8లక్షల గన్నీలు అందుభాటులో ఉన్నాయన్నారు. ఓపీఎంఎస్లో నమోదైన ప్రకారం వెంటనే చెల్లింపులు చేస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. ఇప్పటివరకూ రైతులకు 8576 కోట్లను చెల్లించామన్నారు.
గత ఏడాది కన్నా అధికంగా డిమాండ్ ఉండడంతో రైతులకు ప్రైవేట్ వ్యాపారులు సైతం ఎంఎస్పీ చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని, ప్రభుత్వం సైతం గత సంవత్సరం ఇదే రోజు కన్నా అధికంగా సేకరించిందన్నారు. ముఖ్యమంత్రి రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ధాన్యం కొనుగోల్లకు అవసరమైన నిధుల్ని సంపూర్ణంగా సమకూర్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.