తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసి, రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రైతు సదస్సు ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు చెందిన 1.50 కోట్ల ఎకరాల భూమికి పదో విడత రైతు బంధు మొత్తం జమ చేశామన్నారు. ఇందులో 13 లక్షలు ఎస్సి, 19 లక్షలు ఎస్టీ, 71 లక్షలు బిసి, ఇతరులు 40 లక్షల మంది ఉన్నారన్నారు. 5 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులు 1.40 లక్షల మంది ఉన్నారన్నారు.
ఇప్పటివరకు 65 వేల కోట్లు రైతుబంధు మొత్తం చేరింది చిన్న, సన్నకారు రైతులకేనని ఆయన తెలిపారు. ప్రభుత్వం దూరదృష్టితో రైతుబంధు ప్రవేశపెట్టిందని, రైతుబంధు తో రైతు ఆసక్తిగా వ్యవసాయం చేస్తారని, భూమి బీడు పడదు, రైతు పడావు ఉండడు అని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు భీమా, సాగునీరు, కరంట్ అందించామని, ఇక రైతులు తమ పొలాలకు బాటలు కావాలంటున్నారని ఆయన తెలిపారు.
త్వరలోనే పెద్దఎత్తున రైతుల భూములను అవసరమైన రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. దేశంలో 60 కోట్ల పై చిలుకు వ్యవసాయం పై ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారని, పరోక్షంగా మరో 40 కోట్లు, మొత్తం 100 కోట్ల మంది వ్యవసాయం పై ఉన్నారన్నారు. భూమి ఆత్మగౌరవానికి ప్రతీక అని, భూమి ధైర్యాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు.
పంటల వైవిధ్యం చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని తాండూరు లో పండే కందిపప్పు 24 శాతం ప్రోటీన్లు కలిగివుండి, అంతర్జాతీయ విపణికి చాలా శ్రేష్ఠమైనదిగా నమోదైందని ఆయన అన్నారు. చైనా నుండి వచ్చి, ముదిగొండ లో మిర్చి ఫ్యాక్టరీ పెట్టారన్నారు. వాతావరణం, నేల పరిస్థితులు బట్టి ఏ పంటలు నాణ్యతతో, ఎక్కువగా పండుతాయో ఆలోచించి చేపట్టాలన్నారు. ఖమ్మం జిల్లాలో గత ఏడాది వరకు 8 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు ఉండగా, ఈ ఒక్క ఏడాదే 8 వేల 2 వందల ఎకరాల్లో కొత్తగా సాగు పురోగతి సాధించారని, ఇందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
రైతులకు 36 వేల వరకు రుణమాఫీ చేసినట్టు, లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఆయన అన్నారు. ఆధునిక పద్ధతులు పాటిస్తూనే, సాంప్రదాయ పద్దతిలో భూమిని రక్షించుకోవాలని, భూసారాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. అవసరమైన ఎరువులు, అవసరం మేరకే వాడాలని ఆయన అన్నారు. భిన్నమైన నూనె గింజలు, కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆయన రైతులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, వ్యవసాయం లో కొత్త పుంతలు తొక్కుతూ, పంటల వైవిధ్యం లో జిల్లా ముందుంటుందని అన్నారు.
పామాయిల్ తోటలు మొట్టమొదటగా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సాగుచేసారన్నారు. అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా అని, అనేక చోట్ల గ్రీన్ నెట్ షెడ్, మల్చింగ్, డ్రిప్ లతో రైతాంగం పురోగమించి, ఆధునిక పద్ధతులను చేపత్తుతుందని ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి అన్నారు. వ్యవసాయం దండుగ నుండి పండుగలా మారిందని, రైతుబంధు, రైతుభీమా అమలుచేస్తున్నట్లు ఆయన అన్నారు.
ప్రభుత్వ రంగంలో జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో 5 వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా 128 రైతు వేదికలు నిర్మాణం చేసుకున్నట్లు, 128 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 3,16,000 మంది రైతులకు పది విడతలుగా ఇప్పటివరకు రూ. 3,103 కోట్లు వీక్అరి ఖాతాల్లో జమచేసినట్లు అన్నారు.
మరణించిన 4,060 మంది రైతులకు రూ. 5 లక్షల చొప్పున రూ. 203 కోట్లు అందించినట్లు తెలిపారు. క్రితం సంవత్సరం వరకు 8,000 ఎకరాల్లో ఉన్న ఆయిల్ పామ్ తోటలు, ఈ ఒక్క సంవత్సరం లోనే 8,200 ఎకరాల్లో క్రొత్తగా ప్లాంటేషన్ చేసినట్లు ఆయన అన్నారు. ప్రతి మండలంలో 200 మంది రైతులను గుర్తించి, ఆయిల్ పామ్ తోటలవైపు మల్లేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.