ఆర్టీసీ బస్సుల మైలేజీ నష్టాల కారణంగా… డ్రైవర్లు జీతాల్లో కోత పెట్టాలని సీఎం జగన్ చేసిన దుర్మార్గపు ప్రకటన వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేసారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద ఏఐటీయూసీ, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడానికి మరొకరి పొట్టలు కొడుతున్నారని విమర్శించారు.
సుమారు 30 ఏళ్ళ క్రితం కొనుగోలు చేసినప్పటి ఆర్టీసీ బస్సులకు ఇప్పటికి అదే మైలేజీ రావాలి లేకపోతే ఆర్టీసీ డ్రైవర్ల జీతాల్లో నుంచి కోతలు విధించడం చాలా దుర్మార్గపు నిర్ణయం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 7 లక్షల కిలో మీటర్లు సర్వీసు పూర్తి అయిన బస్సులు నిలుపుదల చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని డ్రైవర్ల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం అని అశోక్ ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా నుంచి వెళ్ళే బస్సులు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం వైపు వెళ్లాలంటే రోడ్లు బాగులేవు, చీపురుపల్లి, రాజాం, పాలకొండ, శ్రీకాకుళం వైపు వెళ్ళాలంటే రోడ్లు బాగులేవు, విశాఖ వైపు వెళ్ళాలంటే విపరీతంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్న తరుణంలో 30 ఏళ్ళ క్రితం బస్సులు ఎక్కువ మైలేజీ ఇవ్వాలంటే ఎలా సాధ్యం అవుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైతే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని…అదీ కాకపోతే, రోడ్లు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసారు.
అదీ చేత కాకపోతే… ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నచోట పరిష్కరించండి అంతే కాని డ్రైవర్ల జీతాల్లో కోతలు విధిస్తే అంగీకరించేది లేదన్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐటీయూసీ నేతృత్వంలో ఎంప్లాయిస్ యూనియన్ తో కలుపుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్శి కె.వి.రమణ, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి.శ్రీనివాస్ రావు, కె.సంజీవ రావు, పి.చంద్రరావు, కె.వెంకట రమణ, ఆర్.సూరిబాబు, కె.కేశవరావు, డి.వి.ఆర్ రాజు, ఎమ్.కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.సునీల్, బి.వాసు, వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.