కర్నూలు జిల్లా శ్రీశైలం జ్యోతిర్లింగ మహాక్షేత్రంలో మహాశివరాత్రి కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు శ్రీశైల దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి కే యస్ రామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆయన మొత్తం శ్రీశైలం క్షేత్ర పరిధిలోని క్యూలైన్లు, వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే భక్తులు కాలినడకన వచ్చే పెచ్చేరువు అటవీ మార్గాన్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం, మహాశివరాత్రి నాడు ప్రాభోత్సవం, ఆ మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం యథావిధిగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వీటిని నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. అయితే కోవిడ్ నిబంధనల మేరకు ఈ సంవత్సరం స్వామి వార్ల స్పర్శ దర్శనానికి కి అవకాశం ఉండదన్నారు.
భక్తులందరికీ కూడా ప్రస్తుతం ఆచరణలో ఉన్నట్టుగానే స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని తెలిపారు.
అదే విధంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల మేరకు పాతాళ గంగలో పుణ్యస్నానాలకు అవకాశం ఉండదని తెలిపారు.
అటవీ శాఖ సహకారంతో కాలినడకన పాదయాత్ర తో వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.