విజయనగరం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాన సంబరాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించాలని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే ఉత్సవాల నిర్వహణలో చొరవ చూపిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందసంస్థల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఉద్దేశ్యంతోనే ప్రముఖులను సోమవారంనాడే దర్శనాలు పూర్తిచేసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. తాను కూడా సోమవారం నాడే దర్శనం చేసుకుంటానని, ఇతరులను కూడా సోమవారం నాడే దర్శనాలు చేసుకోవాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ జాతర ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆలయం పరిసర ప్రాంతాలను పరిశీలించి రెవిన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. సాధారణ భక్తుల దర్శనాలకు వీలుగా మంగళవారం నాడు ప్రముఖుల తాకిడి లేకుండా చూసేందుకే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఆలయంలోకి భక్తులు క్యూలైన్ల ద్వారా ప్రవేశం దర్శనానంతరం తిరిగి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించే ద్వారం వద్ద ఏర్పాట్లు, ఈ మార్గంలో ప్రవేశాలు నియంత్రించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆలయ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ ఏడాది అధికంగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. దీనిని దృష్టిలో వుంచుకొని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్యూలైన్లలో నిల్చొనే వారికి తగిన నీడ కల్పించడంతోపాటు భక్తులకు తాగునీరు, మజ్జిగ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను కోరామన్నారు.
ఉత్సవాల కోసం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరాన్ని సుందరీకరణ చేశామని, ప్రతి జంక్షన్ను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మూడు రోజుల పండగ కోసం వచ్చేవారికోసం మెగా మ్యూజికల్ నైట్, ఆనందోబ్రహ్మ వంటి వినోద కార్యక్రమాలు 13 వేదికల్లో ఏర్పాటు చేశామని, షాపింగ్ చేసేవారి కోసం అఖిల భారత డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 200 స్టాల్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఏర్పాటవుతున్నాయని చెప్పారు.
ఆలయ అభివృద్ధి కోసం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ షాపులను ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, దీనివల్ల ఆలయాన్ని విస్తరించి క్యూలైన్లను అదనంగా ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడిందన్నారు. పండుగ బాగా జరగాలన్నదే అందరి ఆలోచనగా వుందన్నారు. ఇందులో రాజకీయాలకు తావులేదని, తమ స్వార్థం ఏమీలేదని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి సిరిమాను జాతర పూర్తయ్యేలా సహకరించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నట్టు తెలిపారు.ఈ పర్యటనలో పైడితల్లి అమ్మవారి ఆలయ ఇ.ఓ. సుధారాణి, మునిసిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, ఆర్.డి.ఓ. ఎం.వి.సూర్యకళ, డి.ఎస్.పి. గోవిందరావు, ట్రాఫిక్ డి.ఎస్.పి విశ్వనాధ్, తహశీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.