ఎవరైనా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడితే వెంటనే సంబంధిత శాఖ వారికి తెలియజేసి వెంటనే వారికి తగిన చికిత్స అందజేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నరసరావుపేట పట్టణంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా 14 వ వార్డు ను నేడు ఆయన సందర్శించారు.
అక్కడ మునిసిపల్ అధికారులు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ పరిధిలోని ప్రజల వివరాలు, నివారణ కోసం వారు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకుని ,ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరారు.
ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపించినా వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు నిబద్ధత తో పనిచేయాలని, వృద్దుల ఆరోగ్య సమాచారం పక్కాగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ DE శ్రీనివాసరావు, కాకుమాను బాలహనుమంత రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, డా.దత్తు, తలారి నాని తదితరులు పాల్గొన్నారు.