యాసంగి కాలంలో వరికి ప్రత్యామ్నాయంగా పండించే ఆరుతడి పంటలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ- వ్యవసాయ అనుబంధ రంగాల యాజమాన్య పద్ధతులు వ్యాస దీపిక గోడ పత్రికను అదనపు కలెక్టర్ మను చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి కాలంలో పండించే వరిని ఎఫ్ సి ఐ వారు కొనుగోలు చేయటం లేదు కాబట్టి రైతులందరూ గమనించి వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా వ్యవసాయ అధికారులు రైతులకు ప్రోత్సహించాలని సూచించారు.
రైతులకు అవగాహన కలిగించాలని, ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం నిర్ణయించుకుని రైతులచే వరి పంట సాగును విరమించుకుని ఆరుతడి పంటలైన నువ్వులు, రాగులు, పెసర్లు, మినుములు, అదే విధంగా కుసుమ, వేరుశెనగ వంటి నూనెగింజల పంటల సాగుపై అవగాహన కలగచేయాలన్నారు. రైతు లందరికీ సమాచారం తప్పనిసరిగా చేరే విధంగా తగు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చని రైతు కూడా సహకరించి వ్యవసాయ శాఖ తెలియజేసిన సూచనలు సలహాలు పాటించాలని తెలిపారు.
ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించి తప్పనిసరిగా రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటల సాగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా ఆరుతడి పంటల విత్తనాలు లభ్యత అందుబాటులో ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంబంధిత వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి అదే విధంగా వ్యవసాయ యూనివర్సిటీల నుంచి తెప్పించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకోవాలని తెలిపారు.
ఆయిల్ పామ్ పంటల సాగు వైపు మొగ్గు చూపండి
ఆయిల్ పామ్ పంటల సాగు వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపాలని ఆసక్తి ఉన్న రైతులు ముందుగా దరఖాస్తు చేసుకుంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు త్వరగా ఆయిల్ పామ్ మొక్కలు అందించడం జరుతోందన్నారు. రైతులతో వ్యవసాయ అధికారులు సమావేశం నిర్వహించి కొర్ర, రాగి వంటి సూక్ష్మ ధాన్యాలను పండించేటట్లు చేయాలని అదేవిధంగా నూనెగింజల పంటల వైపు కూడా రైతు సోదరులు మొగ్గు చూపే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున యాసంగి కాలంలో ఎలాంటి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు కావున ప్రతి రైతు లకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.
ప్రతి గ్రామంలో సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి సమాచారం రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ ప్రయత్నించాలని సూచించారు. ఉద్యాన అధికారులు రైతు కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించ వచ్చని తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను తీసుకువచ్చే కూరగాయల పంటలు క్యారెట్ ,దొండ, క్యాప్సికం వంటి పంటలను పండించేటట్లు చర్యలు చేపట్టాలన్నారు.
అన్ని రైతు వేదికలు, గ్రామ పంచాయతీల్లో అవగాహన కరదీపికలు గోడ పత్రికను రైతులకు అవగాహన కల్పించేలా అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి రమేష్ మండల స్థాయి వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.