టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ ఆధ్యర్యంలో ఆపరేషన్ లోటస్ పేరుతో వికృత క్రీడ నడుస్తోందని ఆయన అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తోందని ఇది అనాగరిక చర్య అని ఆయన అన్నారు.
సైబరాబాద్ లో బీజేపీ కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.100 కోట్ల రూపాయలతో ముగ్గురు దళారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని ఆయన తెలిపారు. అపరేషన్ లోటస్ పేరుతో ముగ్గురు దళారులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారని, పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు కలిగి ఉన్నారని మనీష్ అన్నారు. వీళ్లు మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగులోకి వచ్చాయని, ఎమ్మెలందరిని తీసుకురండి… డబ్బులు, సెక్కూరిటీ, పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని ఆయన అన్నారు.
సీబీఐ, ఈడీకి భయపడకండి మాదగ్గర ఉంటే ఏ భయం ఉండదని హామీ ఇస్తున్నారని, ఢిల్లీలో కూడా అక్కడి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తున్నాం మని బాహాటంగానే చెబుతున్నారని మనీష్ అన్నారు. ఆడియోలో బీఎల్ సంతోష్, అమిత్ షా పేరు కూడా చెబుతున్నారని ఆయన తెలిపారు. అదే విధంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.1075 కోట్లు ఎక్కడివి? అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరివీ? అమిత్ షా వా? లేక బీఎల్ సంతోష్ వా… ఎవరివి? కేంద్ర హోంశాఖ మంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ ఇలా 8 రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, దేశంలో ఇది త్రీవతరమైన సమస్య అని ఆయన అన్నారు. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉందని మనీష్ తెలిపారు.