కర్నూలు జిల్లాలో తోడికోడళ్లను దారుణంగా హతమార్చిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విచారణలో సంచలన నిజం వెలుగు చూసింది. పిల్లలు పుట్టలేదనే కారణంతో తోటికోడళ్లను మామే నిర్ధాక్షణ్యంగా చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన తోడికోడళ్లు రేణుక, రామేశ్వరి దారుణ హత్యకు గురయ్యారు. పెద్దరామ గోవిందు, చిన్నరామ గోవిందు ఇద్దరు అన్నదమ్ములు.
వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్దరామ గోవిందు భార్య రామేశ్వరి, చిన్నరామ గోవిందు భార్య రేణుక కలిసి పశువుల మేత కోసం గ్రామ సమీపంలోని ఓ పొలంలో పశుగ్రాసం కోసేందుకు వెళ్లారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిపై దాడి చేశారు. వారిద్దరి గొంతు కోసి రాళ్లతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు.
బయటకు వెళ్లిన వారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో సోదరులిద్దరూ పొలం వద్దకు వెళ్లి చూశారు. రామేశ్వరి, రేణుక రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యారు.
సోదరులిద్దరూ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా వారిద్దరికీ పిల్లలు పుట్టడం లేదని కుటుంబ సభ్యులు తరచూ వేధించే వారని స్పష్టమైంది.
ఇంతలో మామ అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరడం మరింత అనుమానాస్పదంగా మారింది. దీంతో పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేయగా.. ఆ మహిళలనే మామే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.