కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న “బాన్సువాడ ఆటోనగర్” కు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. TSIIC యండి నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాదర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ 14.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 300 దుకాణాలు ఏర్పాటు చేయడానికి అనువుగా రూ. 4 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఆటోనగర్ ఏర్పాటుతో 3000 మందికి ఉపాధి కలుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించిన రూ. 3 కోట్లను రైతులకు చెల్లించామని, అదే విధంగా యువకులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర మంత్రి కేటిఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగం దూసుకెళుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారని స్పీకర్ తెలిపారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏళ్ళలో IT రంగంలో 6 లక్షల ఉద్యోగాలు, పరిశ్రమల రంగంలో 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. నా కుమారుడు భాస్కర్ రెడ్డి PBR కోచింగ్ సెంటర్ ద్వారా నియోజకవర్గంలోని 1000 మంది యువతకు పోటీ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ ఇప్పించాడు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఉచితంగా పంపిణీ చేసిన స్టడీ మెటిరీయల్ కొరకు నలబై లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి’’ అని స్పీకర్ తెలిపారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో లాగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేవని ఆయన వివరించారు. హైదరాబాద్ నుండి మెదక్ వరకు జాతీయ రహదారి పూర్తయింది. ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని స్పీకర్ తెలిపారు.