మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ప్రతి సారీ చెబుతున్న ఏపి ప్రభుత్వం మద్యం పాలసీని ప్రతి సారీ మారుస్తూనే ఉంది. లాక్డౌన్ సడలింపుల అనంతరం మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
బార్ లు తమ వద్ద ఉన్న స్టాకు అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగితే అలా వీలేలేదు, మీ స్టాకు అంతా ప్రభుత్వ డిపోల వద్దు ఉంచి వారు అమ్మితే డబ్బులు తీసుకోండి అంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ మద్య నిషేధం దిశగా అడుగులు అంటూ సర్కారు చెబుతూ ఉన్నది.
ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి అధికారులు సమాచారం అందించారు.
ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుందని అందుకే మద్యంపై కనీసం 30 నుంచి 40 శాతం మేర మద్యం ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది.