వారం రోజుల క్రితం మహబూబా బాద్ లో దీక్షిత్ అనే బాలుడు హత్యోదంతం మరవక ముందే.. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో బాలుడు అథియాన్ (5) అదృశ్య ఘటన విషాదాంతమైంది.
శామీర్పేట అవుటర్ రింగ్రోడ్డు పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శామీర్పేట సీఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్పేటకు చెందిన సయ్యద్ ఉసేన్, గౌజ్బీ మూడో కుమారుడు అథియాన్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు.
ఈనెల 15న మధ్యాహ్న భోజనం అనంతరం ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో బాలుడి కోసం గాలించారు.
ఆచూకీ లభించకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బాధితులు ఉంటున్న ఇంటి మరో పోర్షన్లో బిహార్కు చెందిన సోన్సోన్(25) అద్దెకుంటున్నాడు.
మూడు రోజుల క్రితం తాను దొంగలించిన మొబైల్తో ఇంటి యజమానికి ఫోన్ చేశాడు. రూ.15 లక్షలిస్తే బాలుడిని అప్పగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఇంటి యజమాని, బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా బాలుడిని చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
అనంతరం ఘటనాస్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. బాలుడిని చంపి 11 రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.