వచ్చే మూడు నెలల్లోనే పూర్తి స్థాయి సామర్ధ్యం తో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
వాస్తవానికి త్వరితగతిన పూర్తి చేసి ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులతో సహా ఇంజినీర్లు, సిబ్బంది కోవిడ్ బారిన పడడంతో జాప్యం జరిగిందని ఆయన వివరించారు.
జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆగస్టు 20 న జరిగిన ప్రమాదంతో నిలిచిపోయిన యూనిట్లను పునరుద్ధరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం జాలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 1,2 వ యూనిట్లను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా పునః ప్రారంభించారు.
ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్రాజం, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సచ్చిదానందం సివిల్ విభాగం డైరెక్టర్ అజయ్, శ్రీశైలం చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ ఆసాంతం జెన్కో సిబ్బంది చేతుల మీదుగానే జరిగిందన్నారు.
1,2,యూనిట్లను పునఃప్రారంబించుకున్న మనం వచ్చే మూడు నెలల కాలంలో మిగితా యూనిట్ల పునరుద్ధరణ కోసం జెన్కో సిబ్బంది చర్యలు చేపట్టారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.4 వ యూనిట్ మాత్రం పూర్తిగా ధ్వంసం అయినందున మే మాసాంతానికి పునరుద్ధరణ జరుగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.