పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అగ్రనాయకులు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ను కొద్ది రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను కూడా అదే విధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్ (డీవై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరించారు.
డీవై దాస్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా వర్ల రామయ్యకు టిక్కెట్ ఇచ్చింది. దీంతో వైసీపీ తరఫున పోటీ చేసిన ఉప్పులేటి కల్పన నెగ్గారు. ఆ తర్వాత ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మళ్లీ 2019 ఎన్నికల తర్వాత డీవై దాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు డీవై దాస్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత సీఎం జగన్ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా త్వరలో నెల్లూరు, ప్రకాశం కు చెందిన కొంతమంది నేతలను కూడా వైసీపీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారని తెలుస్తోంది.