అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అపూర్వ విజయం సొంతం అయింది. రాజధాని అమరావతిపై హైకోర్టు చారిత్రాత్మక తీర్పును నేడు వెలువరించింది. హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తగిలిన ఎన్నో ఎదురుదెబ్బల్లోకెల్లా పెద్దదిగా చెప్పవచ్చు. రాజధాని ని అభివృద్ధి పరచకుండా సంబంధిత భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్న జగన్ ప్రభుత్వం ఇక నుంచి అలా చేసేందుకు వీలు లేకుండా రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ M. సత్యనారాయణ మూర్తి, జస్టిస్ DVSS సోమయాజులు తో కూడిన బెంచ్ నేడు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. మూడు రాజధానులు చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఉప సంహరించుకున్నది. కేసులపై తుది తీర్పు వెలువడకుండానే చట్టాలను జగన్ ప్రభుత్వం ఉప సంహరించుకున్నా కేసును కొనసాగించిన సీజే బెంచ్ తీర్పు వెలువరించింది.
ఆరు నెలల్లో ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని తీర్పులో పేర్కొన్నది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అదే విధంగా రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.